ఉపాధి వేటలో 'చితికి' పోయిన బతుకు గల్ఫ్ నుంచి వచ్చిన యువకుడి ఆత్మహత్య
ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్ళిన ఆ యువకుడిని విధి వెక్కరించింది. గల్ఫ్ కు వెళ్లేందుకు చేసిన అప్పులు అతడిని వేదనకు గురిచేశాయి.ఎల్లారెడ్డిపల్లి మండలం వెంకటాపూర్ కు చెందిన పిట్టల బాల లచ్చయ్య (22) దుబాయి నుంచి వచ్చిన 25 రోజులకే బతుకు 'చితికి' పోయింది. శనివారం రాత్రి ఇంట్లోని ఓ దూలానికి ఉరివేసుకున్నాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. బాల లచ్చయ్య మూడేళ్ళ కిందట రూ. లక్ష బాకీ చేసి దుబాయికి వలస వెళ్ళాడు. రాత్రింబవళ్ళు కష్టపడినా యజమానులు వేతనాలు చెల్లించలేదు. చివరికి ప్రవాసాంధ్రుల విరాళాలతో స్వగ్రామానికి చేరుకున్నాడు. అప్పులు తీరే మార్గం కనిపించక కుమిలిపోయి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు రాజవ్వ, నర్సయ్య రోదనలు వర్జనాతీతం, మృతునికి సోదరులు శ్రీకాంత్, కనకయ్య ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.