ఉపాధి వేటలో చితికిన బతుకు
ఉపాధి కోసం ఉన్న ఊరును వదిలి వెళ్ళిన ఓ యువకుడు మృత్యఒడిలోకి చేరుకున్నాడు. చివరికి సాటి తెలుగు వారు సాయం అందించడంతో 17 రోజులకు మృతదేహం స్వగ్రామం చేరుకుంది. బందువుల కథనం మేరకు సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లికి చెందిన న్యాతరి ఓదెలు (38) ఉపాధి కోసం రెండేళ్ళ కిందట షార్జా వెళ్ళాడు. కాగ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓదెలు గత నెల 22వ తేదిన మరణించాడు. ఓదెలు ఇంటి నుంచి షార్జా వెళ్లేందుకు బయలుదేరి ముంబాయి వరకు చేరుకున్నాకా అతని పెద్దకుమారుడు విద్యుధఘాతంతో మృతిచెందాడు. ఈ విషయం అతనికి తెలియకుండా బంధువులు జాగ్రత్తపడ్డారు. ఆరునెలలు షార్జాలో పని చేసిన తరువాత ఒదేలును కంపెనీ వారు విధులనుంచి తొలగించారు. గత కొంత కాలంగా అక్కడే కూలీ పని చేసుకుంటున్నా ఓదెలు అనారోగ్యం బారినపడ్డాడు. మెదడుకు శస్త్ర చికిత్ష కూడా చేయించుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన అయన మృత్యువాత పడ్డాడు. దీంతో షార్జాలో స్థానికంగా ఉన్న తెలుగువారు విరాళాలు పోగు చేసి మృతదేహాన్ని ఐతరాజుపల్లికి పంపించారు. శుక్రవారం మధ్యాహ్నం మృతదేహం స్వగ్రామం చేరుకుంది. ఒదేలుకు భార్య,కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ రవీందర్, ఎంపీటీసి సభ్యురాలు రాజమ్మ కోరారు.