ఏజెంట్ ఇంటి ముందు బాధితుల ఆందోళన గ్రామస్తుల జోక్యంతో విరమణ
గల్ఫ్ పంపిస్తానని ఓ ఏజెంట్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆరున నెలలుగా గల్ఫ్ పంపిస్తాడని వేచి చూసి విసిగి వేసారిన బాధితులు ఆదివారం సదరు ఏజెంట్ ఇంటి ముందు క్రిమిసంహారక మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని ఆందోళన చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన మద్దుల బుగ్గరేడ్డి గల్ఫ్ పంపిస్తానని ముస్తాబాద్ మండలం కొండాపూర్ కు చెందిన సబ్ ఏజెంట్ బండి శ్రీనివాస్ ద్వార రూ. 3.90 లక్షలు వసూలు చేశాడు. దుర్గం చంద్రారెడ్డి, ఐలేని చంద్రం, కొండెం వెంకటరెడ్డి, బండి నర్సయ్యలను ఇరాక్ పంపిస్తానని డబ్బులు వసూలు చేశారు. మూడు నెల తర్వాత వారిని ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఇంటికి తీసుకువచ్చాడు. సబ్ ఏజెంట్ శ్రీనివాస్ తన భూములను అమ్మి నలుగురికి డబ్బులు చెల్లించాడు. బుగ్గరేడ్డి మాత్రం శ్రీనివాస్ కు డబ్బులు ఇవ్వక జాప్యం చేస్తువచ్చాడు. దీంతో విసిగిపోయిన శ్రీనివాస్ తన భార్య మంజుల, తల్లితండ్రులు మల్లయ్య, శాంతవ్వ, కుమారులు సాయిప్రసాద్, సతీష్ కుమార్ లతో కలిసి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని బుగ్గరేడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు వచ్చేల ఒత్తిడి తేవాలని సముదాయించడం తో శ్రీనివాస్ ఆందోళనను విరమించాడు. గ్రామస్తుల హామిమేరకు స్వగ్రామానికి తిరిగి వెళ్ళాడు.